తనకు హెర్నియా సర్జరీ చేయించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆ జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ సుయాష్ శర్మ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ శస్త్ర చికిత్సతో తాను నరకం నుంచి బయటపడ్డానని తెలిపాడు. ఈ హెర్నియా సర్జరీ కారణంగా తాను ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమవుతానని భావించానని చెప్పాడు. గత రెండేళ్ల పాటు కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు ఆడిన సుయాష్ శర్మను ఐపీఎల్ 2025 మెగా వేలం రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ సీజన్లో సుయాశ్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడిన సుయాష్ శర్మ 14 వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో ఆర్సీబీకి కీలకంగా మారాడు. అయితే గత సీజన్ వరకు తాను తీవ్రమైన నొప్పితో బౌలింగ్ చేసేవాడినని, ఇంజెక్షన్స్ తీసుకొని ఆడేవాడినని తాజా సుయాష్ శర్మ వెల్లడించాడు.

'ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్సీబీ తరఫున నాకు మంచి అవకాశం వచ్చిందని తెలుసు. నేను ముమ్మరంగా సాధన చేస్తున్నా. అయితే గత రెండేళ్లుగా నేను తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. తరుచుగా ఇంజెక్షన్లు తీసుకొని మ్యాచ్లు ఆడేవాడిని. అసలు నొప్పి ఎందుకు వస్తుందో కూడా నాకు తెలిసేది కాదు. తీవ్రమైన సమస్యగా మారింది.
ఆర్సీబీ టీమ్ సర్జరీ కోసం లండన్ పంపే వరకు నాకు ఉన్న సమస్య ఏంటో తెలియదు. లండన్లో వైద్యులు నాకు మూడు హెర్నియాలు ఉన్నట్లు గుర్తించి సర్జరీ చేశారు. ఆర్సీబీ టీమ్ ఫిజియో జేమ్స్ పైపీ, అతని కుటుంబం నన్ను బాగా చూసుకున్నారు. సొంత కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేశారు. నిజం చెబుతున్నా.. ఈ సీజన్లో నేను తొలి మ్యాచ్ ఆడుతానని అనుకోలేదు. శస్త్రచికిత్స కారణంగా మొదటి మూడు లేదా నాలుగు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని నాకు చెప్పారు.
కానీ జేమ్స్.. నన్ను బాగా చూసుకొని త్వరగా కోలుకునేలా చేశాడు. ఈ ఫ్రాంచైజీలోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్గా ఉన్నాను. గత రెండేళ్లుగా నేను ఈ సమస్యతో బాధపడ్డాను. నొప్పితోనే నా ఆటను కొనసాగించాను. నా సమస్యను గుర్తించి పరిష్కార మార్గం చూపిన ఆర్సీబీకి ధన్యవాదాలు.'అని సుయాష్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన సుయాష్ శర్మ 7.97 ఎకానమీతో 4 వికెట్లు తీసాడు. వికెట్లు తీయకపోయినా.. పొదుపైన బౌలింగ్తో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.