కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలతో అక్మల్ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అతనిపై ఇటీవల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అక్మల్పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు అక్మల్ దూరం కావాల్సి వచ్చింది. అయితే ఈ సీజన్లో తమ ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్న క్వెట్టా గ్లాడియేటర్స్.. తాము చెల్లించిన అడ్వాన్స్ మొత్తం తిరిగివ్వాలని స్పష్టం చేసింది. దీంతో అక్మల్కు మరో తలనొప్పి ఎదురైంది.
టోర్నీకి ముందే క్వెట్టా గ్లాడియేటర్స్ పేమెంట్లో 70 శాతాన్ని అతనికి అందజేసింది. కానీ.. తాజాగా అతనిపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆ డబ్బుని వీలైనంత త్వరగా ఫ్రాంఛైజీకి తిరిగి ఇచ్చేయాలని గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది.
అరుదైన రికార్డు చేరువలో మయాంక్ అగర్వాల్
'అక్మల్ సస్పెండ్ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇవ్వమనండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్లో భాగంగా చెక్ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్కు అందజేశాం. దాంతో ఉమర్కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత'అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్ఎల్లో ఆటగాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును క్రికెట్ బోర్డు ద్వారానే ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్మల్కు 70 శాతం కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించారు.
వాస్తవానికి ఉమర్ అక్మల్పై నెలరోజుల క్రితమే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకునేలా కనిపించింది. లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుకి హాజరైన ఉమర్ అక్మల్.. ఆ టెస్టులో ఫెయిలవడంతో సహనం కోల్పోయి ట్రైనర్తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొవ్వెక్కడుందో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సదరు ట్రైనర్ పీసీబీ ఫిర్యాదు చేయగా.. చిన్న మందలింపుతో వదిలేసింది.