ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్ పర్యటనకు వెళ్లడం అనేక సందేహాలకు దారితీస్తోంది. హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఇంతలోనే అతను జపాన్ పర్యటనకు వెళ్లాడనే వార్తలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. సూర్య.. జపాన్కు వెళ్లిన విషయాన్ని రోహిత్ జుగ్లన్ అనే ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే అతను అక్కడికి ఎందుకు వెళ్లాడో అనే విషయాన్ని మాత్రం జుగ్లన్ చెప్పలేదు. సూర్య.. ఆసియా కప్ ఆడే విషయంపై మాత్రం సందేహాలు వ్యక్తం చేశాడు. సూర్య తన వ్యక్తిగత పనులు మీద జపాన్కు వెళ్లాడా? లేక ఏదైనా గాయానికి చికిత్స తీసుకునేందుకా? అనేది తెలియడం లేదు.

మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్మన్ గిల్కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. మూడు ఫార్మాట్లకు ఒక్క కెప్టెన్ను మాత్రమే నియమించాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమ్ కెప్టెన్, హెడ్ కోచ్తో చర్చించి సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేస్తోంది. కానీ గౌతమ్ గంభీర్ కోచ్గా నియామకమైన తర్వాత.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోహిత్ అనంతరం సూర్య టీ20 సారథ్య బాధ్యతలు, గిల్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ చేపట్టగా.. గంభీర్ సూచనల మేరకే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు.
గాయాల బెడదతో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా అతని జపాన్ పర్యటన భారత క్రికెట్లో కొత్త చర్చకు దారితీసింది. ఆసియా కప్కు సూర్యకుమార్ యాదవ్ లేకుండానే భారత జట్టును ప్రకటిస్తారా? అనే వాదన వినిపిస్తోంది.