
వెల్లింగ్టన్: క్రికెటర్గా సాధించిన ఈ సక్సెస్కు ప్రధాన కారణం తన సతీమణి దెవిషా శెట్టినేనని టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. తన పెళ్లామే తనను నడిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. నేడు(నవంబర్ 7) దెవిషా శెట్టి జన్మదినం కావడంతో ఇన్స్టా వేదికగా తనదైన శైలిలో విషెస్ చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సూర్య.. సతీమణి దెవిషాతో అక్కడికి వెళ్లాడు. ప్రాక్టీస్ అనంతరం అక్కడి పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కివీస్లో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసిన సూర్య.. తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు.
'నా అందమైన పెళ్లానికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె నా ప్రపంచం. నా సమస్యలన్నిటికీ పరిష్కారం. నన్నెప్పుడూ మోటీవేట్ చేస్తూ ఆటపై ఫోకస్ పెట్టేలా.. గర్వం తలకెక్కకుండా భూమి మీదనే ఉండేలా చేస్తోంది. నిజంగా చెప్పాలంటే ఆమె లేకుండా నేను పీకిందేం లేదు. ఆమె నాకు భార్యగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం.'అని సూర్య ఇన్స్టాలో రాసుకొచ్చాడు.

ఇక కెరీర్ పరంగా సూర్య క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో దెవిషా అతనికి అండగా నిలిచింది. ముఖ్యంగా ఐపీఎల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా.. టీమిండియాలో అవకాశం రానప్పుడు అతనిని మరింత ఎంకరేజ్ చేసింది. తీసుకునే ఆహారంలో మార్పులు చేసి మరింత ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. చివరికి గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య.. సూపర్ బ్యాటింగ్తో ఏడాదిలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు.
ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తన సక్సెస్కు దెవిషానే కారణమని చెప్పాడు. ఆమెకు విలువైన గిఫ్ట్స్ కొనిచ్చాడు. టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపిన సూర్య.. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. కానీ ఇంగ్లండ్తో జరిగిన కీలక సెమీఫైనల్లో మాత్రం సూర్య దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇది టీమిండియా నిష్క్రమణకు దారి తీసింది. న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్లో సూర్య స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. కోహ్లీ, రోహిత్ లేని ఈ సిరీస్లో అతనే బ్యాటింగ్ భారాన్ని మోయనున్నాడు.