టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడిన టీమిండియా.. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం మళ్లీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన టీమిండియా.. ఇన్నాళ్లకు మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో టీమిండియా విజయానికి బాటలు వేసాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్సర్గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్ను అడ్డుకొని బంతిని ఒడిసి పట్టుకు సూర్య.. సమన్వయం కోల్పోవడంతో గాల్లోకి విసిరేసాడు.
మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ఒకవేళ సూరీడు ఈ క్యాచ్ వదిలేసి ఉంటే సిక్సర్గా వెళ్లేది. అప్పుడు సమీకరణం పూర్తిగా సౌతాఫ్రికాకు అనుకూలంగా ఉండేది. చివరి ఐదు బంతుల్లో హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీయడంతో పాటు 8 పరుగులే ఇచ్చాడు.
దాంతో టీమిండియా విజయం లాంఛనమైంది. ప్రస్తుతం సూర్య క్యాచ్ నెట్టింట వైరల్గా మారింది. టోర్నీ ఆఫ్ ది క్యాచ్గా నెటిజన్లు సూర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూర్య సంచలన క్యాచే టీమిండియాకు ప్రపంచకప్ అందించిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.