టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాకిస్థాన్ జట్టు గాలి తీసేసాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన టీమిండియా ఏకపక్ష విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా భారత్ తమ నిరసనను తెలియజేసింది.
అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించాడు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు కూడా అండగా ఉంటామని చెబుతూ వారికి సంఘీభావం తెలియజేశాడు. దేశం కంటే క్రీడాస్ఫూర్తి తమకు ఎక్కువ కాదని స్పష్టం చేశాడు.
శుక్రవారం ఒమన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ను పాకిస్థాన్తో ఆదివారం(సెప్టెంబర్ 21) జరగనున్న సూపర్ 4 మ్యాచ్ గురించి ప్రశ్నించగా.. తనదైనశైలిలో బదులిచ్చాడు. పాకిస్థాన్తో తమకు పోటీనే లేదని, అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా హాయిగా నిద్రపోతామని తెలిపాడు.

'మేం పోటీ గురించి మాట్లాడుతాం. మీరు ఏ పోటీ గురించి అడుగుతున్నారో నాకు తెలియదు. మైదానంలోకి వెళ్లిన తర్వాత స్టేడియం నిండిపోయిందనే విషయాన్ని గ్రహిస్తాను. నా జట్టులోని ప్రతీ ఒక్కరికి అభిమానులను అలరించే సమయం ఆసన్నమైందని చెబుతాను. చాలా మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. కాబట్టి వారిని మనం అలరించాలి. మనం మంచి క్రికెట్ ఆడుదామంటాను. ఇంతకు మించి ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించం.'అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో బయటి నుంచి వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకుంటారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. సూర్య తనదైన శైలిలో బదులిచ్చాడు. మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి హాయిగా నిద్రపోతే ఎలాంటి ఒత్తిడి ఉండదన్నాడు. అయితే ఇది చెప్పినంత సులువు కాదని తెలిపాడు. 'ఏం చేస్తాం.. గదిలోకి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలి. అదే ఉత్తమ మార్గం. కానీ ఇది చెప్పినంత సులువు కాదు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది స్నేహితులు కలుస్తారు. డిన్నర్ కోసం బయటకు వెళ్తారు. మ్యాచ్కు సంబంధించిన విషయాలు మాట్లాడే ఆటగాళ్లు కూడా చుట్టూనేఉంటారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.