ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ వేసిన స్లోయర్ షార్ట్ బాల్.. సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్ గ్రిల్కు బలంగా తాకింది. దాంతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ అనూహ్య ఘటన మైదానంలో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, అభిమానులను భయాందోళనకు గురి చేసింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అయితే వేగంగా పరుగెత్తుకొచ్చి మరీ సూర్యకుమార్ యాదవ్ను లేపే ప్రయత్నం చేశాడు. అప్పటికే మైదానంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఫిజియోలు అతనికి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. హెల్మెట్ గ్రిల్ అడ్డుగా ఉండటంతో సూర్యకుమార్ యాదవ్కు పెద్ద గాయం తప్పింది. ఫిజియోల సాయంతో సూర్య.. తన బ్యాటింగ్ను కొనసాగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ను గుర్తు చేసుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే..?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని సూర్యకుమార్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఈ బంతిని ప్రసిధ్ కృష్ణ స్లోయర్ షార్ట్ బాల్గా వేసాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన సూర్య.. ముందుగానే షాట్ ఆడగా.. లేట్గా వచ్చిన బంతి అతను హెల్మెట్ ముందు భాగంలోని గ్రిల్ను బలంగా తాకింది. ఆ బంతి ధాటికి సూర్య ఒక్కసారిగా కుప్పకూలాడు.
వేగంగా పరుగెత్తుకొచ్చిన సిరాజ్.. సూర్యను చెక్ చేశాడు. ఆ తర్వాత ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ చేశారు. హెల్మెట్ గ్రిల్ లేకుంటే సూర్య కుడి కన్నుకు బలమైన గాయమయ్యేది. సూర్య పడిపోవడం చూసి అతని సతీమణి తీవ్ర ఆందోళనకు గురైంది. చివరకు సూర్య లేచి తన బ్యాటింగ్ కొనసాగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముంబైకి తప్పని ఓటమి..
ఈ మ్యాచ్లో ముంబై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 48), తిలక్ వర్మ(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 39)టాప్ స్కోరర్లుగా నిలిచారు.