టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రాణాంతక గాయంపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ క్షేమంగానే ఉన్నాడని, ఫోన్లో మాట్లాడటంతో పాటు మెసేజ్లకు రిప్లే ఇస్తున్నాడని తెలిపాడు. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కు కూడా షిఫ్ట్ చేశారని చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను వెనక్కి పరుగెత్తుతూ అందుకునే క్రమంలో కిందపడిపోయాడు. దాంతో అతని పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతని ప్లీహానికి గాయమైంది.
ప్లీహంలో చీలిక ఏర్పడి అంతర్గత రక్త స్రావం జరిగింది. దాంతో అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. రక్త స్రావం ఆగిపోవడంతో జనరల్ వార్డ్కు షిఫ్ట్ చేశారని సూర్య తెలిపాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరగనున్న తొలి టీ20 నేపథ్యం మంగళవారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. శ్రేయస్ అయ్యర్ గాయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు.

'శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతనికి ఫోన్ చేశాను. కానీ మొబైల్ అతని దగ్గరలేదని తెలిసింది. దాంతో ఫిజియో కమలేష్ జైన్కు ఫోన్ చేసి మాట్లాడాను. కానీ గత రెండు రోజులుగా శ్రేయస్ అయ్యర్తో నేను మాట్లాడుతున్నాను. ఫోన్తో మాట్లాడుతున్నాడంటే అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లే కదా..? ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. డాక్టర్లు అతనితో ఉన్నారు. కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచుకోనున్నారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ అందరికి స్పందిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. ఇది మంచి విషయం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఫిజియోలను బీసీసీఐ చీఫ్ డాక్టర్ దిన్షా పార్ధివాలా ప్రత్యేకంగా అభినందించారు. వారి వేగవంతమైన స్పందన కారణంగానే శ్రేయస్ అయ్యర్కు ప్రాణాపాయం తప్పిందని బీసీసీఐకి తెలియజేశారు.
అదృష్టవశాత్తు శ్రేయస్ అయ్యర్కు ప్రాణాపాయం తప్పినా.. మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టనుంది. ప్లీహం గాయం నుంచి పూర్తి కోలుకునేందుకు అయ్యర్కు కనీసం 3 నెలల సమయం పట్టనుంది. ఈ లెక్కన అతను ఐపీఎల్ 2026 సీజన్తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్ జరగనున్న సంగతి తెలిసిందే.