Suryakumar Yadav: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమిపాలైనా.. తలెత్తుకునేలా ఆడామని టీమిండియా తాత్కలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని మరిచిపోవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించనున్న సూర్య.. వైజాగ్ వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడాడు.
కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించిన సూర్య.. టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. 'ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని మరిచిపోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ప్రపంచకప్ ఫైనల్లో ఓడటం తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ మా ప్రపంచకప్ ప్రయాణం చూసుకుంటే మాత్రం గొప్ప అనుభూతినిస్తోంది.

మేం ఆడిన తీరుకు జట్టులోని ప్రతీ ఆటగాడు, సపోర్ట్ స్టాఫ్, యావత్ భారత్, మా కుటుంబాలు గర్వంగా ఫీలవుతున్నాయి. ఈ టోర్నీలో మేం బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడినా తలెత్తుకునే ప్రదర్శన కనబర్చాం. ఈ ప్రపంచకప్లో రోహిత్ భాయ్ కెప్టెన్గా ఆకట్టుకున్నాడు. ఓ సారథి ఎలా ఉండాలనే విషయంలో ఉదాహారణగా నిలిచాడు.
ఈ ప్రపంచకప్లో నేను ఓ కొత్త రోహిత్ శర్మను చూశాను. టీమ్ మీటింగ్స్లో ఏం మాట్లాడాడో మైదానంలో అదే చేశాడు. ఓ లీడర్గా యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ 2024 దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్లో మా వ్యూహాలను రచిస్తాం. ఈ సిరీస్లో మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. యువ ఆటగాళ్లకు నా సందేశం ఒక్కటే. నిర్భయంగా ఆడాలి. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడాలి. వ్యక్తిగత లక్ష్యాల కంటే టీమ్ టార్గెట్స్ ముఖ్యం. జట్టులోని యువ ఆటగాళ్లందరికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది.
దేశవాళీ క్రికెట్ కూడా బాగానే ఆడారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు.'అని సూర్య(Suryakumar Yadav) చెప్పుకొచ్చాడు.