
ఎక్కడ మొదలుపెట్టానో..
అయితే, తాజాగా సూర్యకుమార్ యాదవ్ వర్చువల్గా మీడియాతో మాట్లాడుతూ.. లంక పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజంతో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని, ఆయన నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 'శ్రీలంకతో తలపడేటప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అది లేకపోతే ఉత్సాహం ఉండదు. ఈ పర్యటన మాకు సవాళ్లతో కూడుకున్నది. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మరోవైపు ఇంగ్లండ్తో అరంగేట్రం చేసిన సిరీస్కూ, ఈ సిరీస్కూ పోలికే లేదు. రెండూ వేర్వేరైనా సవాళ్లు ఒకే రీతిలో ఉంటాయి. ఈ క్రమంలోనే లంకతో ఆడేటప్పుడు నా ఆటను మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నా. ఇదివరకు ఎలా ఆడానో ఇప్పుడూ అలాగే ఆడాలనుకుంటున్నా' అని సూర్య చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్తో తొలిసారి..
కరోనా విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక పర్యటన నిర్వహించడం గొప్ప విషయమని, ఇది తమకు మంచి అవకాశమని సూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు ఇక్కడ రాణించి తమని, తాము నిరూపించుకోవడం సవాళ్లతో కూడుకున్నదన్నాడు. అలాగే రాహుల్ ద్రవిడ్తో కలిసి తొలిసారి పనిచేస్తున్నట్లు చెప్పాడు. 'రాహుల్ ద్రవిడ్తో ఇదే నా తొలి పర్యటన. తన గురించి చాలా గొప్పగా విన్నా. ద్రవిడ్ నేతృత్వంలో మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా. అతనితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా' అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినట్లే భారత జట్టులోనూ ఆడతానని ఈ యువ బ్యాట్స్మన్ స్పష్టం చేశాడు.

శుభసూచకం..
ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడని అది భారత జట్టుకు శుభసూచకమని సూర్య పేర్కొన్నాడు. 'ఇంగ్లండ్తో టీ20ల్లోనూ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఐపీఎల్లో బంతిని అందుకోలేదు. మళ్లీ ఇప్పుడు నెట్స్లో, ప్రాక్టీస్ మ్యాచ్లో బౌలింగ్ చేశాడు. అయితే హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆ నిర్ణయం అతను, జట్టు యాజమాన్యం తీసుకోవాలి. ఏది ఏమైనా అతను మళ్లీ బౌలింగ్ చేయడం జట్టుకు శుభసూచకం'అని సూర్య చెప్పుకొచ్చాడు.

మాకు అనవసరం..
ఇక అక్కడి పరిస్థితులకు అలవాటు పడటంపై మాట్లాడుతూ.. ఇలాంటి ఉక్కపోత పరిస్థితుల్లో తాము ఇదివరకు ఆడామని, చెన్నై, ముంబయిలాంటి నగరాల్లోనూ అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉంటాయని సూర్య వెల్లడించాడు. అలాగే తాము అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికే 15-20 రోజుల ముందుగా వచ్చామన్నాడు. దాంతో ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు. చివరగా తమ జట్టును ద్వితీయశ్రేణి జట్టుగా అభివర్ణించడాన్ని సూర్య కొట్టిపారేశాడు. తాము ఆ విషయం గురించి ఆలోచించడంలేదని తేల్చిచెప్పాడు. శ్రీలంకకు క్రికెట్ ఆడేందుకు వచ్చామని, ఆ సిరీస్లను సానుకూల పరిస్థితుల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నామని తెలివిగా బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications












