టీ20 ఫార్మాట్ బౌలర్లకు చాలా కష్టమైనదని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. బౌలర్లు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారని, ప్రత్యేకమైన ప్రణాళికలతో మాత్రమే బ్యాటర్లను కట్టడి చేయగలరని చెప్పాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది.
గతేడాదిగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో 242 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదని, ప్రతికూల విషయాలను కూడా సానుకూలంగా తీసుకోని ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు.
'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్షణాల కోసం గతేడాదిగా ఎదురుచూస్తున్నాను. ఈ సమయం ఎప్పుడు వస్తుందా? అని కలలు కనేవాడిని. అహ్మదాబాద్లో జరిగిన గత సిరీస్కు ముందే మీరు(మురళీ కార్తీక్) చెప్పారు. 'సూర్య ఉండగా భయం ఎందుకు? అని'. గతేడాదిగా నేను ఏదైతే చేస్తున్నానో, అవే పనులు చేస్తూ వచ్చాను. నేను ఫామ్ కోల్పోలేదని, పరుగులు మాత్రమే చేయడం లేదనే విషయం నాకు తెలుసు.
ఈ సిరీస్ అద్భుతంగా సాగింది. ప్రపంచకప్ ముందు ఇలాంటి ఆత్మవిశ్వాసంతో ఉండటం చాలా ప్రత్యేకం. ఏడాది కాలం ఆకాశం నీలంగా లేదు(నా టైమ్ బాలేదు). కానీ జీవితం అంటే ఇది. ప్రయాణంలో ఇది ఒక భాగం. ఈ బ్యాడ్ టైమ్ను కూడా నేను సానుకూలంగా తీసుకున్నాను. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించి, ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత, నాకు రెండు, మూడు వారాల సమయం దొరికింది. అప్పుడు నా సన్నిహితులతో గడిపాను. నేను అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను వారు నాకు చెప్పారు. ఓ ఆటగాడి జీవితం ఇలానే ఉంటుంది. కేవలం క్రికెట్లోనే కాదు. ఇతర రంగాల్లో కూడా ఎంతో మంది కెరీర్లో ఇలాంటి దశలు రావడం చూశాను. నేను చిన్న చిన్న విషయాలు సరిచేసుకుంటే నా సమయం కచ్చితంగా వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.
గెలిచినా ఓడినా.. ఆట నుంచి ఏదో ఒకటైతే నేర్చుకునే ఉంటాం. మేం ముంబై తిరిగి వెళ్లి, సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్ ఆడేటప్పుడు.. గత ఐదు మ్యాచ్లతో పాటు ఈ ఏడాది మొత్తాన్ని విశ్లేషించుకుంటాం. మేం ఎక్కడ బాగా రాణించాం.. ఎక్కడ మెరుగుపడాలనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత మా ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తాం.
ఈ ఫార్మాట్ బౌలర్లకు చాలా కష్టతరమైనది. ఇది నేను అర్థం చేసుకోగలను. మనం భారీ పరుగులు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా ధీటుగా బదులిస్తుందని ఆశించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్, బౌలర్లు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారు. సరైన ప్రణాళికలు ఉండటమే ఇక్కడ కీలకం. ఇదంతా నేర్చుకునే ప్రక్రియలో భాగమే. మేం కూర్చుని చర్చించుకొని, ముందుకు సాగుతాం. న్యూజిలాండ్ కూడా సాయశక్తులా విజయం కోసం పోరాడింది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.