Suryakumar Yadav: సమష్టి ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో టీమిండియా 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. ప్రణాళికలకు తగ్గట్లు ఆడటంతో విజయం సాధించామని తెలిపాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ఆసీస్ను కట్టడి చేశామని తెలిపాడు. 'ఒక్క టాస్ తప్పా అన్నీ మేం అనుకున్నట్లే జరిగాయి. ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు. సమష్టిగా రాణించడం కలిసొచ్చింది. మ్యాచ్కు ముందు మా ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. మీ సత్తాను భయటపెడుతూ నిర్భయంగా ఆడాలని చెప్పా.

అక్షర్ పటేల్ను ఒత్తిడిలో ఉంచడానికే నేను ఇష్టపడుతా. ఈ మ్యాచ్లో అతను అసాధారణంగా బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయాలనేది మా ప్రణాళిక. అలాగే రాణించి ఫలితాన్ని అందుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.