శివమ్ దూబేకు తోడుగా ఒక్క బ్యాటర్ రాణించినా ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు తమను తాము పరీక్షించుకోవాలనుకున్నామని, అందులో భాగంగానే ఎక్స్ట్రా బౌలర్తో బరిలోకి దిగామని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.
వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్లో మాత్రం ఒక బ్యాటర్కు బదులు ఎక్స్ట్రా బౌలర్తో బరిలోకి దిగింది. కానీ ఈ ప్రయోగం వికటించడంతో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందర్నీ ఆడించాలనే ఉద్దేశంతోనే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ను పక్కనపెట్టాల్సి వచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు. తమను తాము పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో కావాలనే ఈ మ్యాచ్ ఓడిపోయామని తెలిపాడు.

'ఈ మ్యాచ్లో మేం కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం. అదే సమయంలో మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకున్నాం. 180-200 పరుగుల లక్ష్య చేధనలో ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఈ మ్యాచ్లో ఓడినా ఇది మాకు ఓ గుణపాఠం. ప్రపంచకప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఇతర ఆటగాళ్లను ఆడించలేదు.
మేం ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం. ఛేజింగ్లో మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవాలనుకున్నాం. అందుకే టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకున్నా. క్లిష్ట పరిస్థితుల్లో మా ఆటగాళ్లు బాధ్యతను ఎలా స్వీకరిస్తారో చూడాలనుకున్నాం. ఇది ఒక మంచి సవాల్. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే, ఛేజింగ్ చేసే ప్రయత్నం చేస్తాం.
మంచు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఒకటి, రెండు భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది. ముఖ్యంగా శివమ్ దూబే ఆడిన తీరు చూస్తే.. అతనికి తోడుగా ఒక్క బ్యాటర్ నిలిచినా ఫలితం మరోలా ఉండేది. మేం 50 పరుగుల తేడాతో ఓడాం. కానీ పర్వాలేదు. ఇలాంటి భారీ లక్ష్యాలు ఛేజ్ చేసేటప్పుడు ఒకటి, రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే చాలు. అవే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.