Suryakumar Yadav: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తామని టీమిండియా తాత్కలిక టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరగనున్న నేపథ్యంలో శనివారం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు.
వన్డే ప్రపంచకప్ 2023 తృటిలో చేజారినా.. టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. 'అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. వచ్చే ఏడాదే ఈ మెగా టోర్నీ ఉంది. ఇదే స్ఫూర్తితో ఆడతాం. ఈ సారి కచ్చితంగా కప్ గెలుస్తామనే నమ్మకం ఉంది.

వన్డే ప్రపంచకప్ ముగిసి 5-6 రోజులు గడిచాయి. అందరూ నిరాశలో ఉన్నారు. కానీ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన అభిమానుల మద్దతు చూస్తుంటే గొప్పగా ఉంది. ఆటలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇలాగే అండగా నిలవండి.'అని అభిమానులను సూర్య కోరాడు.
ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం టీమ్ డ్రెస్సింగ్ రూమ్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి తమలో స్ఫూర్తి నింపారని సూర్య వెల్లడించాడు. 'ఫైనల్ ముగిసాక డ్రెస్సింగ్ గదిలో కూర్చున్నాం. అప్పుడే ప్రధాని వచ్చి మాలో స్ఫూర్తి నింపారు. ఆటగాళ్లందరినీ కలిసిన ఆయన.. ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని సూచించారు.
దేశ నాయకుడైన ఆయన మాతో సమయం గడపడం గొప్ప విషయం. ఆయన మాటను జాగ్రత్తగా విన్నాం. ఆయన సూచనలను పాటిస్తాం'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. గత ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే ఉత్సాహంలో రెండో మ్యాచ్ గెలిచి సిరీస్లో తమ ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు తొలి టీ20లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి తేరుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తృటిలో చేజారిన విజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి.