ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలని ఉందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నామని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి సూర్యకుమార్ యాదవ్తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల వన్డే సారథి హర్మన్ప్రీత్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్కమింగ్ టీ20 టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది.
షెడ్యూల్ ప్రకటన సందర్భంగా హోస్ట్ జతిన్ సప్రు ఫైనల్లో ఏ జట్టును ఓడించాలనుకుంటున్నారని సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించాడు. అందుకు సూర్య.. 'అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఓడించాలనుకుంటున్నాం.'అని నవ్వుతూ బదులిచ్చాడు.

ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో మాత్రం ఖంగుతిన్నది. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే అదే మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకునే యోచనలో తమ జట్టు ఉందని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
ఈ టోర్నీలో పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న అమెరికాతో ముంబై వేదికగా జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. గ్రూప్-ఏ చాలా బాగుందని చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో ఎప్పుడు ఏ జట్టు బాగా ఆడుతుందో చెప్పలేమన్నాడు. ఇద్దరు బ్యాటర్లు, ఇద్దరు బౌలర్లు సత్తా చాటితే ఫలితం మారిపోతుందని అని చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు తమ కుర్రాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని సూర్య తెలిపాడు. ఆసియా కప్లో ఆ జట్టుతో తమకు మంచి అనుభవం దక్కిందని గుర్తు చేసుకున్నాడు. తమ ఫోకస్ ఎప్పుడూ క్రికెట్పైనే ఉంటుందని, ఇతర విషయాలను పట్టించుకోమని నవ్వుతూ బదులిచ్చాడు. ప్రపంచకప్లో పాక్తో పోరు మంచి మ్యాచ్ అవుతుందని చెప్పాడు.
రోహిత్ శర్మ మాత్రం ఏ జట్టుతోనైనా పర్లేదని, కానీ భారత్ ఫైనల్ చేరాలని, విజేతగా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. 'టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నా. గతంలో జరిగిందేదో జరిగిపోయింది(వన్డే ప్రపంచకప్ ఓటమి). అదే స్టేడియంలో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని సూర్య ఎంతో బాధతో చెప్పాడు. భారత్.. ఏ జట్టుతో ఫైనల్స్ ఆడినా.. విజేతగా చూడాలని కోరుకుంటున్నా.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.