ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ జట్టులో చోటు దక్కనందుకు తనకేం బాధలేదన్నాడు. బాగా ఆడనప్పుడు బాధపడటం ఎందుకు? అని ప్రశ్నించాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక సూర్యకుమార్ యాదవ్ను టీ20 ఫార్మాట్కే పరిమితం చేసిన బీసీసీఐ.. టెస్ట్, వన్డేలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్కు సిద్దమైన సూర్యకుమార్ యాదవ్.. బుధవారం జరిగే తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనందుకు బాధగా ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సూర్య తనదైన శైలిలో బదులిచ్చాడు.

'నేను ఎందుకు బాధపడుతాను? ఒకవేళ నేను బాగా ఆడి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను బాగా ఆడనప్పుడు దాన్ని అంగీకరించడం ముఖ్యం. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును గమనిస్తే.. చూడటానికి జట్టు బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్లో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు.
దేశవాళీ క్రికెట్లోనూ రాణించారు. వారి ఎంపిక పట్ల నేను సంతోషంగా ఉన్నాను. వన్డే ఫార్మాట్లో నేను రాణించనందుకు బాధగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఒకవేళ నేను మెరుగ్గా ఆడి ఉంటే జట్టులో ఉండేవాడిని. నేను బాగా రాణించనప్పుడు మెరుగ్గా ఆడే ఆటగాడు ఆ స్థానానికి అర్హుడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 18 పరుగులే చేశాడు. 37 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 25.76 సగటుతో 773 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఒక్క శతకాన్ని అందుకోలేకపోయాడు. దూకుడైన ఆటతో పాటు సరైన బ్యాటింగ్ పొజిషన్ లేక వన్డేల్లో సూర్య రాణించలేకపోయాడు.
టీ20 ఫార్మాట్లో మాత్రం సంచలన బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు 78 టీ20 మ్యాచ్లు ఆడి 2570 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉండటం గమనార్హం.