Suryakumar Yadav: అండర్ 19 ప్రపంచకప్ విజయంలో మునిగి తేలుతున్న క్రికెట్ అభిమానులకు టీమిండియా బ్యాటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పసికూన అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో అనూహ్య ఆటతీరుతో పెవిలియన్కు క్యూ కట్టారు. సిక్సర్లు దేవుడెరుగు.. వికెట్లు పడకపోతే చాలురా అయ్యా అని అభిమానులు దేవుడిని కోరుకునేటర్లు ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ అందుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్విక్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. హర్మీత్ సింగ్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసారు.

గత రెండేళ్లుగా దూకుడైన ఆటతీరుతో అలరించిన టీమిండియా.. పసికూన అమెరికాను చితక్కొడుతుందని భావించిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. విధ్వంసానికి మారుపేరైనా అభిషేక్ శర్మ(0) గోల్డెన్ డకౌట్ అవ్వగా.. దూకుడైన బ్యాటింగ్తో ఓపెనర్గా ప్రమోషన్ అందుకున్న ఇషాన్ కిషన్(20), మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(25) వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఈ మూడు వికెట్లను అమెరికా ప్రైమ్ బౌలర్ వాన్ షాక్ తీయడం గమనార్హం. బ్యాటింగ్లో ప్రమోషన్ అందుకొని అప్ది ఆర్డర్ వచ్చిన శివమ్ దూబే(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగడంతో పవర్ ప్లేలోనే టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులే చేసింది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ తన శైలికి భిన్నంగా నిధానంగా ఆడలేకపోయిన రింకూ సింగ్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన హార్డిక్ పాండ్యా(5) కూడా భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. దాంతో టీమిండియా 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్(14)తో కలిసి జట్టును అందుకున్నాడు. తనదైన బౌండరీలతో పరుగులు రాబట్టాడు.
అక్షర్ కూడా వరుసగా రెండు బౌండరీలు బాదడంతో జట్టు స్కోర్ 100 ధాటింది. 41 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని హర్మీత్ సింగ్ విడదీసాడు. అక్షర్ పటేల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అర్ష్దీస్ సింగ్ సాయంతో సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత టాపార్డర్ను కుప్పకూల్చిన వాన్ షాక్విక్ వేసిన 19వ ఓవర్లో సూర్య.. బౌండరీ, సిక్స్ బాదాడు. అయితే ఇదే ఓవర్లో అర్ష్దీప్ సింగ్ను వాన్ షాక్ విక్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. నేత్రవాల్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య 4,6,6, 4,0,1 బాది 21 పరుగులు పిండుకున్నాడు. దాంతో టీమిండియా 161 పరుగులు చేయగలిగింది.