టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ను హార్దిక్ పాండ్యా వేయగా.. క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్ తొలి బంతినే భారీ షాట్ ఆడాడు. లాఫ్టెడ్ షాట్తో బంతిని అద్భుతంగా కనెక్ట్ చేశాడు. దాంతో సిక్సర్ పక్కా అని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

దాంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా లక్ష్యాన్ని అందుకోలేక ఓటమిపాలైంది. సూర్య అందుకున్నది బంతి కాదని, టీ20 ప్రపంచకప్ అని అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పటికీ ఈ క్యాచ్ భారత అభిమానుల ముందు కదలాడుతూనే ఉంది. అయితే ఈ క్యాచ్ కాన్సెప్ట్తోనే ఓ వినాయక మండపం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
వినాయక చవితి నేపథ్యంలో గుజరాత్లోని వాపిలో ఓ గణేష్ మండపాన్ని టీ20 ప్రపంచకప్ ఫైనల్ తరహాలో ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ తరహా స్టేడియాన్ని వేసిన నిర్వాహకులు బొమ్మల సాయంతో సూర్య స్టన్నింగ్ క్యాచ్ను రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వినాయక మండపానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదెక్కడి క్రేజ్ రా మామ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా రిషభ్ పంత్ కూడా ఈ క్యాచ్ను గుర్తు చేసుకున్నారు. డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్తో ప్రపంచకప్ చేజారిందని భయపడ్డానని, కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అడ్డుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. 'బంతి గాల్లోకి లేవగానే పక్కా సిక్సర్ అనుకున్నాను. ఎందుకంటే బ్యాట్కు బంతి బాగా కనెక్ట్ అయ్యింది. బ్యాట్కు బంతి తాకినప్పుడే ప్రపంచకప్ చేజారిందనుకున్నాను. కానీ భారత అభిమానుల ప్రార్థనల వల్ల బంతి బౌండరీ లైన్ ధాటలేదు.'అని పంత్ చెప్పుకొచ్చాడు.
Suryakumar Yadav's catch (T20 World Cup Final) theme Ganesh Pandal in Vapi, Gujarat. pic.twitter.com/0RTsbAOpBZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2024