ఆస్ట్రేలియాతో రెండో టీ20లోనూ టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీగా స్పందించాడు. టాస్ ఓడిన వెంటనే.. లాభం లేదు పూజలు చేయాల్సిందేనని సైగలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా గాశారం బాలేదని, పూజలు చేయాల్సిందేనని సూర్య భాయ్.. గంభీర్కు చెబుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు అయితే టీమిండియాకు దిష్టి తగిలిందని, పొట్టేలు బలియ్యాలని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా ఐదో మ్యాచ్లో భారత్ టాస్ ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్ మూడు మ్యాచ్ల్లో టాస్ ఓడిపోగా.. ఐదు టీ20ల సిరీస్లో గత రెండు మ్యాచ్ల్లో సూర్య టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మనకు గాశారం సాల్తలేదని, పూజలు చేయాల్సిందేనని సూరీడు ఫన్నీగా సైగలు చేశాడు.

మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టీ20ల్లో 19వ సారి టాస్ గెలిచాడు. ఈ 19 సార్లు అతను బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. తాజా టీ20లోనూ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగే చేసేవాళ్లమని సూర్య తెలిపాడు.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. బౌన్సీ పిచ్పై జోష్ హజెల్ వుడ్ నిప్పులు చెరగడంతో 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(5), సంజూ శాంసన్(2), సూర్యకుమార్ యాదవ్(1), తిలక్ వర్మ(0), అక్షర్ పటేల్(7) దారుణంగా విఫలమయ్యారు. పిచ్ కండిషన్స్ గౌరవించకుండా దూకుడే మంత్రంగా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. అక్షర్ పటేల్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా సాయంతో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.