టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్కు అతని కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ప్రకారం బ్యాండ్ బాజా మధ్య మంగళ హారతులతో సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కారు దిగిన సూర్యకు ముందుగా అతని తండ్రి అశోక్ కుమార్ యాదవ్, తల్లి స్వప్న యాదవ్లు పూలమాల వేసి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం సూర్య అత్తమామ కూడా మంగళ హారతులతో స్వాగతం పలికారు. మధ్యలో సూర్య సన్నిహితుడు ఒకరు పూల దండ ఇచ్చి అతని సతీమణి దేవిషా శెట్టికి వేయమని సూచించాడు. దాంతో సూర్య పూల దండ అందుకొని తన సతీమణి మెడలో వేయగా అందరూ చప్పట్లతో అభినందించారు.

ఈ సన్నివేశంలో సూర్య కొత్త పెళ్లి కొడుకును తలపించాడు. కొత్తగా పెళ్లి అయిన జంట ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు ఎలా స్వాగతం పలుకుతారో.. ప్రపంచకప్ గెలిచిన సూరీడికి అదే రీతిలో వెల్కమ్ చెప్పారు. సూర్య సతీమణి దేవిషా డ్యాన్స్ చేస్తూ తన భర్తను ఉత్సాహపరిచింది. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి బ్యాండ్ బాజా మధ్య చిందేసారు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కీలక సమయంలో బౌండరీ లైన్ వద్ద సూర్య అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ను సూర్య వదిలేసి ఉంటే టీమిండియా ఓటమిపాలయ్యేది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 మ్యాచ్లు ఆడిన సూర్య 28.44 సగటుతో 199 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తుఫాను కారణంగా టీమిండియా ఆలస్యంగా స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం తెల్లవారు జామున ఢిల్లీకి వచ్చిన టీమిండియా.. ప్రధాని నరేంద్ర మోదీతో బ్రేక్ ఫాస్ట్ చేసింది. సాయంత్రం ముంబై వేదికగా బీసీసీఐ నిర్వహించిన జైత్ర యాత్రలో పాల్గొంది. ఈ జైత్ర యాత్ర ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లగా.. వారికి కుటుంబ సభ్యులు, స్థానిక అభిమానులు ఘన స్వాగతం పలికారు.