స్పిన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాడని భావించే శివమ్ దూబేను ఫస్డ్ డౌన్లో బ్యాటింగ్ పంపించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కానీ తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని అంగీకరించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఓటమెరుగని జట్టుగా భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దాంతో టీమిండియా సునాయసంగా 200 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడంతో సాధారణ స్కోర్కే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్కు బదులు శివమ్ దూబే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయగా.. సంజూ శాంసన్ను బ్యాటింగ్కే పంపించలేదు. శివమ్ దూబే(2) నిరాశపర్చగా.. అక్షర్ పటేల్(10) జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తమ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై వివరణ ఇచ్చుకున్నాడు. 'ఈ టోర్నీ మాకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఓమన్తో జరిగిన మ్యాచ్లో మాత్రమే మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అయితే సూపర్-4లో ముందుగా బ్యాటింగ్ చేసి మా సత్తాను పరీక్షించుకోవాలనుకున్నాం.
బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్లో లెఫ్టార్మ్ స్పిన్నర్తో పాటు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. దాంతో 7-15 ఓవర్లలో వారిపై దూబే విరుచుకుపడుతాడని అప్ది ఆర్డర్ పంపించాం. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఔట్ ఫీల్డ్ వేగంగా ఉండి ఉంటే.. మా స్కోర్ 180-185 అయ్యుండేది. కానీ మా దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్తో 12-14 ఓవర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తే మేం విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్లు సైఫ్ హసన్వే కావడం గమనార్హం.