ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించేందుకే మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79) విధ్వంసకర బ్యాటింగ్తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/21) రెండు వికెట్లు తీయగా..ఆదిల్ రషీద్కు ఓ వికెట్ దక్కింది.
14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మళ్లీ గాయం తిరగబెట్టిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే షమీని ఆడించకపోవడం వ్యూహాత్మక నిర్ణయమేనని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడంతోనే మహమ్మద్ షమీ బెంచ్కు పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు.
'టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ ముగిసేవరకూ ఒకే జోరును కొనసాగించాం. ముందుగా మా ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ సాగింది. తర్వాత లక్ష్యాన్ని సునాయసంగా అందుకున్నాం. పిచ్ కండిషన్స్ను బట్టే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాం. సౌతాఫ్రికాలోనూ ఇదే విధంగా ఆడాం. ముగ్గురు స్పిన్నర్లూ అద్భుతంగా రాణించారు.
కొత్త బంతితో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ముందుకు వచ్చాడు. దాంతోనే అదనపు స్పిన్నర్ను తీసుకున్నాం. వరుణ్ చక్రవర్తీ పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకుంటాడు. అద్భుతమైన రికార్డ్ సాధించిన అర్ష్దీప్ సింగ్కు అభినందనలు. హార్దిక్ పాండ్యాతో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అర్ష్దీప్ సింగ్కు తెలుసు. అదనపు బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు రావడం అభినందనీయం.
ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడంలో గౌతమ్ గంభీర్ ముందుంటాడు. ఫీల్డింగ్లోనూ మెరుగ్గా రాణించాం. ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి చాలా శ్రమించాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.