ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ మైదానంలో మేం ఎక్కువగా ఆడలేదు. వీలైనంత ఎక్కువగా ఈ వికెట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఐదు మ్యాచ్ల సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల వరకు పోటీ ఉండటం అద్భుతం. ఇరు జట్లు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. మా జట్టులో నాలుగు మార్పులు చేశాం. ఆడమ్ జంపా, మ్యాక్స్వెల్, ఫిలిప్, డ్వార్షుయిస్ బరిలోకి దిగుతున్నారు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడినా తాము కోరుకున్నదే లభించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికే ద్వైపాక్షిక సిరీస్లు ఆడేదన్నాడు. 'ఈ మ్యాచ్కు ముందు మాకు మంచి విశ్రాంతి లభించింది. ప్రాక్టీస్ కూడా బాగా చేశాం. ఇదో అద్భుతమైన స్టేడియం. పిచ్ చూడటానికి ఉపఖండపు వికెట్లా ఉంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లోగా మారవచ్చు.
ఈ క్రమంలోనే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాం. మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం కోరుకున్నదే దక్కింది. ఈ మైదానం భారత పరిస్థితులనే తలపిస్తోంది. బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచే ప్రయత్నం చేస్తాం. మేం విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం
తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. దాంతో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి నిరాశే ఎదురైంది.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, గ్జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.