ఆసియాకప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్ల షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు.
భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని భావించిన పాక్ ఆటగాళ్లు.. వారి తీరుతో నిరాశగా మైదానం వీడారు. ఈ వ్యవహరంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య సేన చేసిన పనిని భారత అభిమానులు కొనియాడుతుంటే.. పాకిస్థాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు.
ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ను ఓ మీడియా ప్రతినిధి.. షేక్ హ్యాండ్ వ్యవహారంపై ప్రశ్నించాడు. 'మీరు సిక్స్ తో మ్యాచ్ ముగించారు. అనంతరం నేరుగా డగౌట్కు వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా.. మీరు పట్టించుకోలేదు. ఇలా చేయాలని ముందుగానే టీమ్ సమావేశంలో నిర్ణయించారా? మ్యాచ్ అనంతరం జట్టు మొత్తం ఒకే విషయంపై కట్టుబడి ఉండాలని చర్చించుకున్నారా? 'అని ఓ మీడియా ప్రతినిధి అడిగాడు. తాము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని సూర్య బదులిచ్చాడు.

'మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. ఈ విజయంతో పాకిస్థాన్కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు క్రీడా స్ఫూర్తి కంటే ముందుండే విషయాలు చాలా ఉంటాయి. వాటిని నేను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లోనే చెప్పాను.'అని సూర్య బదులిచ్చాడు. పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటమే ఎక్కవ.. మళ్లీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడమా? అన్నట్లు సూర్య తన సమాధానాన్ని ఇచ్చాడు. బీసీసీఐ ఆదేశాల మేరకే ఈ మ్యాచ్ ఆడినట్లు పరోక్షంగా వెల్లడించాడు. తమకు కూడా పాక్తో మ్యాచ్ ఆడాలనే ఆసక్తి లేదనే విషయాన్ని తన మాటల్లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అంతకుముందు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని భారత సాయుద బలగాలకు అంకితం ఇస్తున్నట్లు సూర్య తెలిపాడు. ' పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉన్నాం. మా ప్రగాఢ సానుభూతిని తేలియజేశాం. అలాగే ఆపరేషన్ సిందూర్తో దైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సాయుధ బలగాలకు ఈ వి జయాన్ని అంకితం ఇచ్చాం. వారు మా దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. వారికి ఈ విజయాన్ని అంకితం చేయడానికి ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి లేదు.' అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.