IND vs AUS 2nd T20: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. రెండో ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నా. వికెట్ కూడా బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. క్యూరేటర్తో కూడా మాట్లాడాను. గత మ్యాచ్లో మేం బాగానే ఆడినా.. టీమిండియా మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. జట్టులో రెండు కీలక మార్పులు చేశాం. ఆడమ్ జంపా, గ్లేన్ మ్యాక్స్వెల్ బెహ్రండార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో జట్టులోకి వచ్చారు.'అని మాథ్యూ వేడ్ తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. రాత్రి మ్యాచ్ కావడంతో డ్యూ వస్తుందని, టార్గెట్ను కాపాడుకోవడం సవాల్తో కూడుకున్న పనేనని తెలిపాడు. భారీ స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోవడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని అభిప్రాయపడ్డాడు.
గత మ్యాచ్ విజయం తమకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపిన సూర్యకుమార్ యాదవ్.. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ క్రమంలోనే జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ టీమ్తో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు. తనకు కెప్టెన్సీ కొత్త సవాల్, సరికొత్త బాధ్యతని తెలిపాడు.
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, గ్లేన్ మ్యాక్స్వెల్, మాథ్యూ వేడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా