ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి మంచి పిచ్లా కనిపిస్తోంది. ఈ గొప్ప స్టేడియంలో ఆడటం ఎప్పుడూ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సిరీస్ను డ్రా చేసేందుకు ఈ మ్యాచ్ మాకు మంచి అవకాశం. ఈ సిరీస్లో ఇప్పటికే చాలా ఆడాం. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన చేసాయి. గత మ్యాచ్లో పిచ్ కండిషన్స్ విభిన్నంగా ఉన్నాయి. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్ పరిస్థితులు వేరు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

'మ్యాచ్లు ఓడిపోనంత వరకు టాస్ ఓడినా పోయిదేం ఏం లేదు. టాస్తో సంబంధం లేకుండా మేం మా సత్తా చాటాలనుకుంటున్నాం. జట్టు లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం ఎప్పుడైన కీలకం. గత మ్యాచ్లో ఆ వికెట్ 200 పరుగులు చేసేది కాదని బ్యాటర్లంతా గ్రహించారు. గత మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించాం. అదే ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం.
ద్వైపాక్షిక సిరీస్లు గెలవడం ఎప్పుడైనా మంచిదే. అదే సమయంలో ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగాలనేది కూడా కీలకమే. పొట్టి ఫార్మాట్లో ఓపెనర్లు మినహా ప్రతీ ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. తుది జట్టులో ఒక మార్పు చేశాం. తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి రింకూ సింగ్ను తీసుకున్నాం. రింకూ సింగ్కు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి విజేతగా నిలవాలనుకుంటుంది. మరోవైపు ఆసీస్ సిరీస్ సమం చేయడంపై ఫోకస్ పెట్టింది.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జాష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జాష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.