టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పకున్నా.. పరోక్షంగా వెల్లడించాడు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ను సూర్యకుమార్ యాదవ్ కలిసాడు. ఎన్టీఆర్తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాగుందని కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.
రెండేళ్ల క్రితం(2023) న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. సహచర ఆటగాళ్లతో పాటు ఎన్టీఆర్ను కలిసాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. తన సతీమణితో కలిసి ఎన్టీఆర్తో దిగిన ఫొటోను సూర్య ఇన్స్టాలో పంచుకున్నాడు. 'మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది బ్రదర్.. ట్రిపుల్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నందుకు మరోసారి అభినందనలు' అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఈ పోస్ట్కు "ధన్యవాదాలు సూర్య.. నిన్ను కలవడం నాకూ సంతోషంగా ఉంది. రేపటి మ్యాచ్లో దుమ్మురేపు'అని జూనియర్ ఎన్టీఆర్ బదులిచ్చాడు.

సినిమాలు, హీరోల గురించి చాలా తక్కువగా మాట్లాడే సూర్య.. జూనియర్ ఎన్టీఆర్పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూర్య ఎన్టీఆర్తో తప్పా మరే హీరోతోనూ ఫొటో దిగలేదు. ఇదే అతనికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తోంది. తనకు కామెడీ సినిమాలు అంటే ఇష్టమని, సమయం దొరికితే చూస్తానని ఓ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'హేరా ఫేరీ', 'చుప్కే చుప్కే', 'అందాజ్ అప్నా అప్నా' అనే బాలీవుడ్ కామెడీ చిత్రాలు తనకు బాగా నచ్చాయని పేర్కొన్నాడు. తమిళ హీరో, తలపతి విజయ్ అంటే తనకు ఇష్టమని, కాలేజీ రోజుల్లో ఆయన సినిమాలను థియేటర్లలో చూసేవాడినని ఆ ఇంటర్వ్యూలో సూర్య గుర్తు చేసుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్.. ఆసియా కప్ 2025 కోసం సన్నదమవుతున్నాడు. అతని సారథ్యంలోనే భారత్ ఈ టోర్నీ ఆడనుంది. ఇటీవలే హెర్నీయా సర్జరీ చేసుకున్న సూర్య పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్తో భారత క్యాంపైన్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 14న దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం వార్-2 అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ కలెక్షన్లను అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్గా చేశారనే ప్రచారం వార్2కు నెగిటివ్గా మారింది.