Suryakumar Yadav: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైఖరి ఏంటో సూర్య స్పష్టం చేశాడు.
మెగా టోర్నీ నేపథ్యంలో గురువారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో పాల్గొన్న సూర్యను పాక్ బాయ్కాట్ గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. 'మేం మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. మా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మేం వారితో ఆడబోమని ఎప్పుడూ చెప్పలేదు. పాకిస్థానే ఆడనని అంటోంది. పాక్తో మ్యాచ్కు సంబంధించిన మా ఫ్లైట్ టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. మేం షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్తున్నాం. మా షెడ్యూల్ ఖరారైంది. ముందుగా యూఎస్ఏ, తర్వాత నమీబియా, ఆ తర్వాత కొలంబోకు బయలుదేరుతాం’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ జట్టు మైదానంలోకి రాకపోయినా.. భారత్ మాత్రం ఐసీసీ నిబంధనలను పాటించనుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా కొలంబో చేరుకుని, ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటుంది. అలాగే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లకు కూడా హాజరవుతుంది.
మ్యాచ్ రోజున భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చి టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ కోసం వేచి చూస్తారు. ఒకవేళ పాక్ జట్టు రాకపోతే, మ్యాచ్ రెఫరీ సూచనల మేరకు భారత్కు వాకోవర్ ద్వారా విజయం లభించనుంది.

మ్యాచ్ సమయానికల్లా పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంటుందని అంతా భావిస్తుండగా.. ఆ దేశ ప్రధాని షెహాబాజ్ షెరీఫ్ తగ్గేదేలేదని ప్రకటించారు. భారత్తో మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరిస్తే.. భారత్కు ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా, పాకిస్థాన్ నెట్ రన్ రేట్ కూడా భారీగా దెబ్బతింటుంది. వారి సూపర్ -8 అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి భారీ జరిమానాతో పాటు ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇరు జట్లు సూపర్-8 దాటి సెమీఫైనల్, ఫైనల్కు చేరుకుంటే.. అప్పుడు కూడా పాక్ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
లీగ్ దశలో భారత్ నాలుగు మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో, ఫిబ్రవరి 12న న్యూఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్తో.. చివరగా ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశ తర్వాత టాప్-2 జట్లు సూపర్ 8 టోర్నీకి చేరుకుంటాయి.