సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడటం మెగా టోర్నీకి గొప్ప సన్నాహకంగా మారుతుందని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
దాంతో ఈ సిరీస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఈ ఐదు టీ20ల సిరీస్ మూడు మ్యాచ్ల సిరీస్గా మారిపోయింది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తమ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు.

'కాన్బెర్రాలో జరిగిన తొలి మ్యాచ్ కూడా పూర్తవ్వాలని కోరుకున్నాం. కానీ వర్షం మన నియంత్రణలో లేని విషయం. ఈ సిరీస్లో మా ఆటగాళ్లంతా సహకరించిన తీరు, ముఖ్యంగా 0-1తో వెనుకంజలో నిలిచిన స్థితి నుంచి మేం పుంజుకున్న విధానం అద్బుతం. ఈ గెలుపు క్రెడిట్ ఆటగాళ్లదే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మాకు ఇది గొప్ప సిరీస్. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా-అర్ష్దీప్ సింగ్లది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్.
అక్షర్, వరుణ్ కూడా తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా రాణించాడు. మా ఆటగాళ్లంతా ఇప్పటికే చాలా టీ20 క్రికెట్ ఆడారు. జట్టు కోసం ఏమైనా చేయగలరు. జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నందున తుది జట్టు ఎంపిక స్వీట్ హెడెక్ మారింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి మూడు బలమైన జట్లతో ఆడటం.. ప్రపంచకప్ టోర్నీకి గొప్ప సన్నాహకంగా ఉంటుంది.
ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు వారికి అసాధారణమైన ప్రేక్షకాదరణ లభించింది. సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అదే సమయంలో గెలవాలనే ఉత్సాహం, బాధ్యత కూడా కలుగుతోంది. దేశంలో ఎక్కడ ఆడినా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. టీ20 ప్రపంచకప్ ఒక అద్భుతమైన సవాల్. కానీ ఈ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా రెండు ముఖ్యమైన సిరీస్లు ఆడాలి. ఇంకా చాలా విషయాలను చూడాల్సి ఉంది. ప్రపంచకప్ మరింత రసవత్తరంగా ఉంటుందని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా సూర్య రికార్డ్ సాధించాడు.