ఒమన్ ఓటమిపాలైనా.. ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకుందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఒమన్ కోచ్ సులక్షణ్ కురకర్ణి వల్లే ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు. ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 21 పరుగుల తేడాతో ఒమన్ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. ఒమన్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఒమన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు.
'తదుపరి మ్యాచ్ నుంచి నేను 11వ స్థానంలో ఆడే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఒమన్ అసాధారణమైన క్రికెట్ ఆడింది. వారి ఆట నన్ను బాగా ఆకట్టుకుంది. ఒమన్ కోచ్ సులు సర్(సులక్షణ్ కులకర్ణి) గురించి నాకు తెలుసు. ఆయన వల్లే ఒమన్ జట్టుకు కచ్చితత్వం వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం. వారి ఆటను నేను నిజంగా ఆస్వాదించాను.
ఎక్కువగా బెంచ్పై కూర్చొని ఒక్కసారిగా జట్టు తరఫున బరిలోకి దిగి రాణించడం కొంచెం కష్టం. ఇక్కడ వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంది. హార్దిక్ పాండ్యా ఔట్ అయిన విధారం దురదృష్టకరం. కానీ అతన్ని ఆట నుంచి ఏ మాత్రం దూరం చేయలేం. హార్దిక్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. సూపర్ 4 మ్యాచ్లకు అన్ని విధాల సిద్దంగా ఉన్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికి బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది.
ఈ మ్యాచ్లో ఒమన్ ఓడినా.. తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చింది. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లో భారత బౌలర్లను చెడుగుడు ఆడింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్.. ఈ మ్యాచ్లో కాస్త కష్టంగానే గెలుపొందింది.