అర్ష్దీప్ సింగ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కారణంగానే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో శుక్రవారం సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ ఫైనల్లా అనిపించిందని చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించకుండా ఆఖరి వరకు గెలుపు కోసం శ్రమించాలని తమ ఆటగాళ్లకు చెప్పానని, ఈ మ్యాచ్ను సెమీఫైనల్లా భావించి ఆడించాలని సూచించానని తెలిపాడు.

'ఈ మ్యాచ్ నిజంగా ఫైనల్ను తలపించింది.(నవ్వుతూ). రెండో ఇన్నింగ్స్ ఫస్టాఫ్ తర్వాత కూడా మా కుర్రాళ్లు చాలా పట్టుదల చూపించారు. ఈ మ్యాచ్ను సెమీఫైనల్లా భావించాలని మా ఆటగాళ్లకు చెప్పా. ఫలితం గురించి ఆలోచించకుండా సాయశక్తులా ఆఖరి వరకు పోరాడాలని చెప్పాను. ఈ మ్యాచ్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది.
అదిరిపోయే ఆరంభం తర్వాత సంజూ, తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే టెంపోను ముందుకు తీసుకెళ్లారు. సంజూ మిడిలార్డర్లో వచ్చి బాధ్యత తీసుకోవడం, తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం బాగుంది. అర్ష్దీప్ సింగ్ చాలా సార్లు సూపర్ ఓవర్స్ వంటి క్లిష్ట ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను మాకు అనేక విజయాలు అందించాడు. మనం ఇప్పటికే ఫైనల్ చేరాం.
ఎక్కవగా ఆలోచించకుండా నీ ప్రణాళికలను నమ్ముకొని, వాటిని అమలు చేయాలని మాత్రమే చెప్పాను. అతను తన ప్రణాళికలను అమలు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత్ తరఫున, ఐపీఎల్ ఫ్రాంచైజీ తరఫున ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. సూపర్ ఓవర్కు అర్ష్దీప్ సింగ్ తప్పా మరో ఆప్షన్ నాకు కనిపించలేదు.
ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రాత్రిని రికవరీకి ఉపయోగించుకుంటాం. ఈ రోజు మా కుర్రాళ్లలో కొంతమందికి కండరాలు పట్టేసాయి. రేపు విశ్రాంతి దినాన్ని వాడుకుంటాం. ఈ రోజు ఎలా ఆడామో అలానే ఫైనల్లో బరిలోకి దిగుతాం. నేను మా కుర్రాళ్ల నుంచి కోరుకునేది ఒక్కటే.. ప్రణాళికలను అమలు చేయడం, ఎలాంటి బెరుకు లేకుండా క్లారిటితో ఆడటం ముఖ్యం. జట్టులో ప్రతీ ఒక్కరు వారు కోరుకునేది పొందాలని అనుకుంటున్నాను. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరినందుకు సంతోషంగా ఉంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్లతో 107) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. సూపర్ ఓవర్లో శ్రీలంక 2 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోగా.. భారత్ తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.