న్యూఢిల్లీ: ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచే సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. మైదానం నలు మూలలు ఆడే సూర్య.. ఇండియన్ ఏబీడీగా అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే రెండు సెంచరీలు బాదాడు. అతని బ్యాటింగ్ శైలి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అందరూ ఇష్టపడుతారు.
అయితే కెరీర్ ప్రారంభంలో తాను దూకుడుగా ఆడటాన్ని చాలా మంది తప్పుబట్టారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇలా ఆడితే సక్సెస్ కాలేవని, పనికి రాకుండా పోతావని భయపెట్టేవారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ అనంతరం స్వదేశానికి వచ్చిన సూర్య.. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు.
తాజాగా ఓ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'నేను అండర్- 15, అండర్-17 క్రికెట్ ఆడే సమయంలో నా బ్యాటింగ్ తీరును ఎన్నో రకాలుగా విమర్శించేవాళ్లు. ఇలా ఆడితే కెరీర్లో పైకి రాలేవని చెప్పేవాళ్లు. నేను మాత్రం నా బ్యాటింగ్ స్టైల్ని మార్చుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. కోచ్ కూడా నాకు అండగా నిలిచారు.
ఫార్మాట్ ఏదైనా నా మైండ్లో ఫిక్స్ అయ్యింది ఒక్కటే... నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలని. అందరూ తప్పని చెప్పిన బ్యాటింగ్ స్టైలే.. నన్ను టీమిండియాలోకి తీసుకొచ్చింది. నేను నమ్మింది తప్పు కాదని నిరూపించింది.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
సచిన్ను తొలిసారి కలిసిన విషయాన్న గుర్తు చేసుకున్న సూర్య.. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో అదే తన ఫేవరేట్ ప్లేస్ అని చెప్పుకొచ్చాడు. 'అండర్ 22 క్రికెట్ ఆడే సమయంలో నేను తొలిసారి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను కలిసాను. ఐపీఎల్లో నాకు చోటు దక్కడంతో ఎన్నో ఆశలు, అంతకు మించిన భయాలతో వాంఖడే స్టేడియానికి వెళ్లాను.
ఆ రోజు నేను కాస్త ఆలస్యంగా వెళ్లా. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ అంతా నిండిపోయి ఉంది. కూర్చోవడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదు. సచిన్ సర్.. వినాయక విగ్రహం పక్కనే కూర్చున్నారు. నాకు ఓ కూర్చి ఇచ్చి, అక్కడే కూర్చోమన్నారు. నేను టక్కున అందులో కూర్చున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అదే ప్లేస్లో కూర్చుంటా. ఆ ప్లేస్ నాకు సెంటిమెంట్గా మారిపోయింది.'అని సూర్య పేర్కొన్నాడు.