టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పతనం మొదలైంది. గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్లో మకుటం లేని మహారాజుగా కొనసాగిన సూర్య.. తాజాగా తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నెంబర్ వన్ ర్యాంక్ను అందుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిన ట్రావిస్ హెడ్ 844 రేటింగ్ పాయింట్స్తో సూర్యను వెనక్కినెట్టాడు. సూర్య 842 రేటింగ్ పాయింట్స్తో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజామ్ 755, మహమ్మద్ రిజ్వాన్ 746 రేటింగ్ పాయింట్స్తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

గత 601 రోజులుగా సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగాడు. టీ20 ప్రపంచకప్ 2024లోనూ సూర్య అద్భుత ప్రదర్శనే కనబరుస్తున్నాడు. అఫ్గానిస్థాన్పై హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన సూరీడు.. 29 సగటు, 139 స్ట్రైక్రేటుతో 149 పరుగులు చేశాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ మాత్రం 7 ఇన్నింగ్స్ల్లో 158 స్ట్రైక్రేట్తో 255 రన్స్ చేశాడు. ఇంగ్లండ్తో గురువారం జరిగే సెమీఫైనల్లో సూర్య తన మార్క్ ఇన్నింగ్స్ ఆడితే మళ్లీ అగ్రస్థానాన్ని అందుకుంటాడు.
ఈ మ్యాచ్లో విఫలమైతే మాత్రం అతని పతనం మొదలైనట్లే. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ సూర్యకు రెస్ట్ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే అతన్ని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. అతను మళ్లీ శ్రీలంక పర్యటనతోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్, ఫైనల్లో(ఒకవేళ చేరితే) సూర్య విఫలమైతే.. ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంకులో కొనసాగుతాడు.
గ్రూప్ దశలో అమెరికా, పాకిస్థాన్, ఐర్లాండ్ను మట్టికరిపించిన టీమిండియా.. సూపర్-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.