శివమ్ దూబే అద్భుతమైన బ్యాటింగ్తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా అజేయంగా సూపర్-8 దశకు చేరుకుంది.
శివమ్ దూబే ఆల్రౌండ్(66, 2/35) ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సహచర బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్పై శివమ్ దూబే అలవోకగా సిక్సర్లు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్గా తనకు తలనొప్పేనని చమత్కరించాడు. శివమ్ దూబే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. 190 పరుగులు చేయగలిగాం. మైదానంలో కొంచెం మంచు ఉంది. అది మా బౌలర్లకు కొంత సవాలుగా మారింది. కానీ ఆశించిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం కొన్నిసార్లు తొందరగా వికెట్లు కోల్పోవచ్చు. కానీ అప్పుడు బ్యాటర్లు తమ బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం.
మా బ్యాటింగ్ లైనప్లో మెరుపులు మెరిపించే ఫైర్ పవర్ ఆటగాళ్లు ఉన్నారు. శివమ్ దూబే విశాఖ వేదిగా న్యూజిలాండ్తోనూ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాడు. ఆ రోజు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవాలనుకున్నాడు. కానీ ఈ రాత్రి అతను జట్టుకు 190 పరుగుల భారీ లక్ష్యం అందించడం అద్భుతం.

మేం అనుకున్నవన్నీ సరిగ్గా చేయగలిగాం. గెలిచినప్పుడు కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈ రోజు కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం. మా జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు ఉండటం కెప్టెన్గా నాకు తలనొప్పినే. పిచ్ తగ్గట్లు మా బౌలర్లు రాణించగలరు. ప్రస్తుతం మా ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతీ బ్యాటర్ నుంచి సహకారం అందుతోంది. ఒకరిద్దరికి అద్భుతమైన రోజు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరి నుంచి సహకారం అందడం మాకు అవసరం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా..తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34) దూకుడుగా ఆడలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్(3/56) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లేన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమిపాలైంది. బాస్ డీ లీడే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33), జాచ్ లయన్(16 బంతుల్లో ఫోర్, సిక్స్తో 26), నోహ్ క్రోస్(12 బంతుల్లో 5 ఫోర్లతో 25 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/14) మూడు వికెట్లు తీయగా.. శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. సూపర్-8 దశలో టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.