Suryakumar Yadav, IND vs AUS 2nd T20: టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్పై తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని ఫినిషింగ్ అద్భుతమని కొనియాడాడు. రింకూ సింగ్ బ్యాటింగ్ చేసిన విధానానికి బిత్తరపోయానని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్తోనే గెలిచామని తెలిపాడు. ఇన్నింగ్స్ చివర్లో అతను రాబట్టిన పరుగులే తమ విజయానికి బాటలు వేసాయని తెలిపాడు. అతని అసాధారణ ఫినిషింగ్ మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తుందని అభిప్రాయపడ్డాడు.

'కుర్రాళ్లంతా నాపై ఒత్తిడి లేకుండా చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. దాంతో కెప్టెన్గా నా పని మరింత సులువు అవుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బ్యాటింగ్కు సిద్దంగా ఉండాలని మా కుర్రాళ్లకు చెప్పాను. మూడు ఓవర్ల తర్వాత చాలా డ్యూ వచ్చింది. దాంతో మీ బలాలను నమ్ముకొని ఆడండని సూచించాను.
రింకూ సింగ్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో ఎంతో ప్రశాంతంగా మ్యాచ్ను ముగించిన అతను.. ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో అవాక్కయ్యేలా చేశాడు. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఆడాడు. అతను చేసిన అదనపు పరుగులు మా విజయవకాశాలను మరింత మెరుగుపరిచాయి. రింకూ సింగ్ ఆడుతున్న విధానం చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకు వస్తున్నాడు. ఈ మ్యాచ్లో మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకున్నారు. విపరీతమైన డ్యూ ఉన్నా సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(25 బంతుల్లో 30 ఫోర్లు, 2 సిక్స్లతో 53), రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 58), ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో రింకూ సింగ్(9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ మాథ్యూ వేడ్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్దీస్ సింగ్, అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ తలో వికెట్ తీసారు.