సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్కు టీమిండియా సిద్దమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 టీమ్.. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్తో ఈ నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది.
ఇప్పటికే కుర్రాళ్లతో కూడిన టీమిండియా ఈ సిరీస్ కోసం సన్నదమవుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత ఇరు జట్లు మరోసారి తలపడుతున్నాయి. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత రికార్డుల పరంగా టీమిండియానే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఆతిథ్య జట్టు రెడీ అవుతోంది.

ఈ సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 2021లో టీ20 ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన సూర్య.. ఇప్పటి వరకు 74 మ్యాచ్లు ఆడి 2544 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మరో 107 రన్స్ చేస్తే..
సౌతాఫ్రికాతో ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్య 175.63 స్ట్రైక్రేట్తో 346 పరుగులు చేశాడు. మరో 107 పరుగులు చేస్తే భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్(452) అగ్రస్థానంలో కొసాగుతున్నాడు.
మరో 6 సిక్స్లు కొడితే..
ఈ సిరీస్లో సూర్య మరో 6 సిక్స్లు బాదితే టీ20ల్లో 150 సిక్స్ల మైలురాయి సూర్య అందుకుంటాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో మార్టిన్ గప్టిల్(173), రోహిత్ శర్మ(209) ముందున్నారు. సూర్యకుమార్ యాదవ్ 144 సిక్స్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నికోలస్ పూర్ 144 సిక్స్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
టీ20ల్లో సూర్య ఇప్పటి వరకు 4 సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో మరో రెండు శతకాలు సాధిస్తే.. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కుతాడు. ఈ జాబితాలో గ్లేన్ మ్యాక్స్వెల్(5), రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఒక్క సెంచరీ చేసినా సూర్య వారిని సమం చేస్తాడు.