ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. వన్డే సిరీస్ విజయంతో గత వారం మాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. భారత గడ్డపై గెలవడం ఎంత కష్టమో ప్రతీ జట్టుకు తెలుసు. స్వదేశీ పరిస్థితుల్లో భారత్ అత్యంత బలమైన జట్టు.
ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా మాకు ఇది గొప్ప ఆరంభం. మేం ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం. క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. జెమీసన్, డఫీలు కూడా బరిలోకి దిగుతున్నారు.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉందన్నాడు. . 'ప్రాక్టీస్ సమయంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటాన్ని గమనించాం. అందుకే మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.
అయితే గత మ్యాచ్ల్లో మేం ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించి మెరుగైన ప్రదర్శన కనబర్చాం. కాబట్టి ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ మ్యాచ్కు శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ దూరంగా ఉన్నారు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
భారత్: సంజు శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ.