డ్రెస్సింగ్ రూమ్లోనే తమ అసలైన ట్రోఫీలు ఉన్నాయని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. దాంతోనే ఆసియా కప్ 2025 ట్రోఫీని స్వీకరించలేదని చెప్పాడు. ఇది అప్పటికప్పుడు మైదానంలో తీసుకున్న నిర్ణయమని, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే పాకిస్థాన్తో తొలిసారి ఫైనల్ జరగ్గా టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఒకే ఎడిషన్లో పాకిస్థాన్ను మూడు సార్లు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా 9వ ఆసియా కప్ టైటిల్ను టీమిండియా ముద్దాడింది. మ్యాచ్ అనంతరం ట్రోఫి ప్రెజెంటేషన్, మెడల్స్ స్వీకరించే కార్యక్రమం దాదాపు గంటరన్న ఆలస్యంగా ప్రారంభమైంది. చివరికి టైటిల్తో పాటు మెడల్స్ స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన అధికారుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని భారత్ స్పష్టం చేసింది. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్, రన్నరప్ మెడల్స్ ప్రధానంతో ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసింది. దాంతో సూర్యకుమార్ యాదవ్ బ్రాడ్కాస్టర్తో మాట్లాడలేదు.
విజయానంతరం అభిషేక్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ట్రోఫీ నిరాకరించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా తన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. 'నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఛాంపియన్గా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం చూడలేదు. నాకు తెలిసి ఇదే తొలిసారి అనుకుంటున్నా. చాలా కష్టపడి మేం ఈ విజయాన్ని సాధించాం. అయితే మా అసలైన ట్రోఫీలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి. జట్టులోని సహచర 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నా అసలైన ట్రోఫీలు. మేం విజేతలుగా నిలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు మేం దాదాపు గంటన్నరపాటు వేచి చూశాం.
ఛాంపియన్ ట్రోఫీ బ్యానర్ తీసుకురావడం వల్లే ఆలస్యమైంది. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని మాకు ఎవరి నుంచీ ఆదేశాలు రాలేదు. మేం మైదానంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఆసియా కప్లో నాకు వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.'అని అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. టీ20ల్లో భారత్ ఆటగాళ్లకు బీసీసీఐ రూ. 3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందిస్తుంది.
అయితే ఆసియా కప్ 2025లో మాత్రం రూ.4 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ. 28 లక్షల రూపాయలను సూర్య.. భారత ఆర్మీకి విరాళంగా అందించనున్నాడు. ఏఐతో రూపొందించిన ట్రోఫీ ఫొటోను సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.. 'మ్యాచ్ ముగిసాక కేవలం ఛాంపియన్స్ గుర్తుంటారు. ట్రోఫీ ఫొటో కాదు'అని సూర్య పేర్కొన్నాడు.