ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి మంచిగా కనిపిస్తోంది. నిన్న మైదానంలో డ్యూ కనిపించింది. తొలి రౌండ్ నుంచే మేం నాకౌట్ టోర్నీలా ఆడుతున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అబుదాబిలో పిచ్ పూర్తిగా భిన్నమైనది. కానీ ఈ పిచ్ సాధారణమే. మాకు ఇది మరో మ్యాచ్ మాత్రమే. అర్ష్దీప్, హర్షిత్ స్థానంలో బుమ్రా, వరుణ్ తిరిగి వచ్చారు.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తెలిపాడు. ఇది కొత్త మ్యాచ్ అని, సరికొత్త సవాల్ అని పేర్కొన్నాడు. జట్టు మూడ్ మాములుగానే ఉందని, పిచ్ కాస్త స్లోగా ఉన్నట్లు కనిపిస్తోందన్నాడు. బ్యాట్, బంతితో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నామని, తుది జట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు.

టాస్ సమయంలో భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ నెల 14న ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లోనూ పాక్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ సారథి సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం తాజా మ్యాచ్కు కూడా ఆండీ పై క్రాఫ్ట్నే మ్యాచ్ రిఫరీగా నియమించింది.
తుది జట్లు:
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ : సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.