ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ముందుగా బ్యాటింగ్ చేయలేదని, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తమ బ్యాటర్ల సత్తా ఏంటో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ముందుగా బ్యాటింగ్ చేయలేదు. మా బ్యాటర్ల సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. సూపర్-4కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం చాలా కీలకం. తొలి రెండు మ్యాచ్ల తరహాలోనే ఈ మ్యాచ్లోనూ రాణించాలనుకుంటున్నాం. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. పిచ్ బాగుంది. మా ఓపెనర్లు మరింత బాగా అంచనా వేయగలరు.

తుది జట్టులో రెండు మార్పులు చేశాం. హర్షిత్ రాణా జట్టులోకి రాగా.. మరో ఆటగాడు ఎవరూ మరిచిపోయాను. నేను రోహిత్లా తయారయ్యాను.'అని సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ చెప్పాడు. ఈ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ దూరంగా ఉండగా.. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తుది జట్టులోకి వచ్చారు. బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ తెలిపాడు. 'నేను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడిని. ఈ టోర్నీ మాకు గొప్ప అనుభవం. మా జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. మా ఆటగాళ్లకు అనువం తక్కువ. కానీ తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఈ టోర్నీ గొప్ప అవకాశం. భారత జట్టుతో కలిసి ఆడటం గొప్ప అవకాశం. మా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి.'అని జతిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఒమన్: ఆమిర్ కాలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్ట్, మహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రమనాండి.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.