ఈ విజయం వారికి అంకితం.. ఇషాన్ బ్యాటింగ్ అద్భుతం: సూర్యకుమార్ యాదవ్
దాయాదీ పాకిస్థాన్పై సాధించిన ఏకపక్ష విజయం యావత్ భారతావనికి అంకితమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో సూపర్-8 బెర్త్ను దక్కించుకోవడంతో పాటు పాక్పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఏ దశలోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఇషాన్ బ్యాటింగ్ అద్భుతం..
ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడిన సూర్య.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని ప్రశంసించాడు. 'ఈ విజయం యావత్ భారత్కు అంకితం. మేం ఏ తరహా క్రికెట్ అయితే ఆడాలనుకున్నామో.. అదే ఆట ఆడాం. ఇషాన్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం.
గత కొన్ని మ్యాచ్లతో పాటు దేశవాళీ క్రికెట్లో ఎలా ఆడాడో అదే ఫామ్ను ఇక్కడ కూడా కొనసాగించాడు. జట్టు స్కోరు 0-1 వద్ద ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఇషాన్ ఆ పనిని అద్భుతంగా పూర్తి చేశాడు. బ్యాటింగ్లో మిడిల్ ఓవర్లలో కొంచెం తడబడ్డాం. కానీ టీ20 క్రికెట్ బ్యూటీనే అది. తిలక్, దూబే, రింకూ బ్యాటింగ్ చేసిన తీరు మెచ్చుకోదగ్గది.

15-20 పరుగులు ఎక్కువ చేశాం..
ముందుగా బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోరు సరిపోతుందో అంచనా వేయడం కష్టం. కానీ మేం 175 పరుగులు చేయగానే 15-20 పరుగులు ఎక్కువే చేశామని అనిపించింది. ఒకవేళ 155 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండేది. హార్దిక్ కొత్త బంతితో బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా తనేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరోసారి నిరూపించాడు.
జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించడం చూడముచ్చటగా ఉంది. ఇక మా తదుపరి ప్రయాణం గురించి రేపు ఆలోచిస్తాం. ఈ రాత్రి జట్టుతో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటాం. ఆపై అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత తదుపరి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఇషాన్ ఊచకోత..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications