విధ్వంసకర బ్యాటింగ్కు తన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లే కారణమని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వారు ఇచ్చిన స్వేచ్చతోనే తాను ఇలా దూకుడుగా ఆడగలుగుతున్నానని తెలిపాడు. పరీక్షల సమయంలో కూడా వారు తనకు కావాల్సిన సెలవులు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నాడు. వారిచ్చిన సెలవుల్లోనే తాను మైదానం వెళ్లి మరింత ఎక్కువగా ప్రాక్టిస్ చేయగలిగానని, అప్పుడే ఆట గురించి నేర్చుకున్నానని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను 3-0తో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధించామని తెలిపాడు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే దూకుడుగా ఆడేవాడివా? అని హోస్ట్ ప్రశ్నించగా.. అంతా మా ప్రిన్సిపాలే చేశాడని సూర్య నవ్వులు పూయించాడు.
'మా స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు క్రికెట్ ఆడేందుకు నాకు చాలా సమయం ఇచ్చేవారు. పరీక్షల సమయంలో కూడా వారు నాకు సెలవులు ఇచ్చారు. అది నేను గ్రౌండ్కు వెళ్లి బాగా ప్రాక్టీస్ చేసేందుకు ఉపయోగపడింది. అక్కడే ఆట గురించి మరింత ఎక్కువగా నేర్చుకున్నాను.’అని సూర్య చెప్పుకొచ్చాడు.

ఈ లక్ష్య చేధన గురించి మేం ముందే మాట్లాడుకున్నాం. మేం ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా సరే ఇలాంటి దూకుడుతో కూడిన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. ఒకవేళ రేపు మేం 20 పరుగులకే 3 వికెట్లు లేదా 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు బాగా తెలుసు. టీ20 క్రికెట్లో తదుపరి స్థాయికి వెళ్లాలంటే దూకుడే సరైన మార్గమని నేను భావిస్తున్నా. ఇక మా టాప్ 2-3 బ్యాటర్ల గురించి ఏం చెప్పాలి. వారు నా పనిని చాలా సులభతరం చేశారు.
రవిబిష్ణోయ్ ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. తన బలాలు ఏంటో, బౌలింగ్ ఏంటో అతనికి బాగా తెలుసు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు అతను ఎప్పుడు రాణిస్తాడు. అతను జట్టులో ఉండటం చాలా సంతోషం. అలాగే వరుణ్కు కూడా మంచి విశ్రాంతి దొరికింది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48), మార్క్చాప్మన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32), మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/17) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా(1/35) ఒక వికెట్ తీసాడు.
అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్), సూర్యకువార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు.