ఆసియా కప్ 2025 టోర్నీలో తాను ప్రశాంతంగా కెప్టెన్సీ చేయడానికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సతమణి రితికా సజ్దేనని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఆమె చెప్పిన సలహా పాటించడంతోనే తాను భావోద్వేగాలను అదుపు చేసుకొని ప్రశాంతంగా తన పని తాను చేసుకున్నానని తెలిపాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో ఫైనల్తో సహా మూడు సార్లు పాకిస్థాన్ను టీమిండియా చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలందుకున్న భారత్కు ఫైనల్లో గట్టి పోటీ ఎదురైంది. తీవ్ర ఒత్తిడిలో కెప్టెన్గా సూర్య సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. సోమవారం స్వదేశం చేరిన సూర్య.. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని రితికా సజ్దే చెప్పిన సలహాను పాటించడంతోనే తాను ప్రశాంతంగా కెప్టెన్సీ చేయగలిగానని చెప్పాడు. ప్రధాన టోర్నీలకు ముందు రోహిత్ శర్మ ఇలానే చేసేవాడని, సోషల్ మీడియా యాప్స్ను తొలగించేవాడని రితిక చెప్పిందని సూర్య పేర్కొన్నాడు. తాను కూడా అదే ఫాలోవుతున్నానని తెలిపాడు.

'ఆసియా కప్ ఆడేందుకు దుయాబ్ రావడానికి ముందే నా మొబైల్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ఇన్స్టా, ట్విటర్, ఫేస్బుక్ను తొలగించాను. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మాత్రమే ఉపయోగించాను. మొబైల్లో సోషల్ మీడియా యాప్స్ ఉంటే అందులో వచ్చే మెసేజ్లు అన్ని చూడాలనిపిస్తోంది. మెగా టోర్నీలు ఆడటానికి ముందు రోహిత్ శర్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని రితిక సజ్దే చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. రోహిత్ యాప్స్ అన్ని తొలగించేవాడని పేర్కొంది. నేను అదే ఫాలోయ్యాను. దీని వల్ల నాకు మంచి జరిగింది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా సత్తా చాటినా బ్యాటర్గా తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ వరుసగా.. 7*(2), 47*(37), 0(3), 5(11), 12(13), 1(5) పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్ల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. సౌతాఫ్రికా పర్యటనలో 2023, డిసెంబర్ 14న టీ20ల్లో చివరిసారిగా(100) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్లోనూ 50 ప్లస్ స్కోర్ చేయలేదు.