Suryakumar Yadav, IND vs AUS 1st T20: రింకూ సింగ్ అసాధారణ ఫినిషింగ్తోనే విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రింకూ సింగ్ ప్రశాంతంగా ఆడి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడని కొనియాడాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. రింకూ సింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'రింకూ సింగ్ ఆడిన తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. తీవ్ర ఒత్తిడిలోనూ అతను ప్రశాంతంగా ఉన్నాడు. అతని అద్భుతమైన ఫినిషింగ్ జట్టుకు ఎంతో బలాన్నిస్తోంది.'అని సూర్య కొనియాడాడు.

జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారని సూర్య తెలిపాడు. 'కుర్రాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. ఓ దశలో మేం ఒత్తిడికి గురైనా.. మా కుర్రాళ్లు సత్తా చాటారు. టీమిండియాకు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. చాలా గర్వించదగిన క్షణం. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే గొప్ప అయితే.. కెప్టెన్సీ చేసే అవకాశం దక్కడం నాకు బిగ్ మూమెంట్.
డ్యూ వస్తుందని భావించాం. కానీ రాలేదు. ఇది చిన్న మైదానం కావడంతో బ్యాటింగ్ చేయడం చాలా సులువని నాకు తెలుసు. ఆసీస్ ఆడిన తీరుకు 230-235 పరుగులు చేస్తారని భావించాను. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. ఆటను ఆస్వాదిస్తూ మీ సత్తా చూపించండని కుర్రాళ్లకు చెప్పాను.
ఈ తరహా పరిస్థితులను ఫ్రాంచైజీ క్రికెట్లో చాలా చూశాం. ఇషాన్ కిషన్ను ఒక్కటే చెప్పాను. నీ ఆటను ఆస్వాదిస్తూ సత్తా చూపించమని తెలిపాను. డ్రెస్సింగ్ రూమ్లోనే నా కెప్టెన్సీని వదిలేసి బ్యాటింగ్ను ఆస్వాదించే ప్రయత్నం చేశాను. ఇక్కడి వాతావరణం బాగుంది. ముఖ్యంగా ప్రేక్షకులు వేల సంఖ్యలో హాజరై అండగా నిలిచారు. మా బౌలర్లు చివరి ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కే కట్టడి చేశారు.'అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80), ఇషాన్ కిషన్(39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ షార్ట్, జాసన్ బెహ్రెండార్ఫ్ తలో వికెట్ తీసారు.