హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్తోనే విజయం సాధించామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. బ్యాటింగ్ డెప్త్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పుంజుకోవచ్చని ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టమైందన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్..లోయరార్డర్ బ్యాటింగ్, బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే గెలుపు సాధ్యమైందని చెప్పాడు. 'ఈ పిచ్ గురించి 50-50 గా ఉన్నామని టాస్ అప్పుడే చెప్పాను. ముందుగా బ్యాటింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 175 పరుగులు చేయడం అద్బుతం. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్తో ఇది సాధ్యమైంది. చివర్లో జితేష్ శర్మ తన వంతు సహకారం అందించాడు.

మేం 160 పరుగులు చేస్తే గొప్ప అనుకున్నా. కానీ 175 పరుగులు చేయడం అసాధారణం. 7-8 మంది బ్యాటర్లు ఉన్నప్పుడు ఇద్దరు, ముగ్గురు విఫలమైనా.. మిగతా బ్యాటర్లు జట్టుకు అండగా నిలుస్తారు. ఈ రోజు అదే జరిగింది. బహుశా తదుపరి మ్యాచ్లో మరొకరు రాణిస్తారేమో. టీ20 క్రికెట్ ఇలానే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ రాణించాలని మేం కోరుకుంటున్నాం. ప్రతీ ఒక్కరు నిర్భయంగా బ్యాటింగ్ను ఆస్వాదించాలి. భారత్ మంచి జోష్లో ఉంది.
ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేసేందుకు అర్ష్దీప్, బుమ్రా సరైన బౌలర్లు. కొత్త బంతితో అర్ష్దీప్, బుమ్రా మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. గాయం నుంచి కోలుకోని జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. అతను బౌలింగ్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. అతని అసాధారణ బ్యాటింగ్తోనే టీమిండియా 175 పరుగులు చేసింది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి.. 7 నుంచి 15 ఓవర్ల మధ్య 90-91 పరుగులు చేసి, ఆపై చివరి ఐదు ఓవర్లలో 40-44 పరుగులతో 175కి చేరుకోవడం నిజంగా అద్భుతం. ప్రశంసనీయం. మాకున్న బౌలింగ్ ఆప్షన్స్ నేపథ్యంలో 175 మంచి స్కోర్.