ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో పాటు బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు తమ బ్యాటర్లు, బౌలర్లు రాణించారని కొనియాడాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో 168 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లతో పాటు బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్తో పాటు బ్యాటర్లందరికీ అభినందనలు. పవర్ ప్లేలో చాలా తెలివిగా ఆడారు. ఈ పిచ్ 200+ స్కోర్ చేయడానికి అనువైన వికెట్ కాదని వారు త్వరగా గ్రహించారు. బ్యాటింగ్లో ప్రతీ ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారు. బ్యాటింగ్లో సమష్టిగా రాణించడంతోనే పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం. టీమ్మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. నేను, గౌతీ భాయ్ ఒకేలా ఆలోచిస్తున్నాం.

బౌలర్లు చాలా వేగంగా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త మంచు కురిసినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. జట్టులో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. పిచ్ కండిషన్స్ బట్టి ఏ బౌలర్తో ఎన్ని ఓవర్లు వేయాలనేది నిర్ణయిస్తాం. కొన్ని మ్యాచ్ల్లో వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. మరికొన్ని మ్యాచ్ల్లో 2-3 ఓవర్లకే పరిమితం కావచ్చు. శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్ కూడా తక్కువ ఓవర్లు వేయవచ్చు. కండిషన్స్ బట్టే బౌలింగ్ ఆప్షన్స్ను ఉపయోగించుకుంటాం. జట్టు అవసరం తగ్గట్లూ రాణించేందుకు ప్రతీ ఒక్కరు సిద్దంగా ఉన్నారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 శనివారం బ్రిస్బేన్ వేదికగా జరగనుంది.