విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా చెలరేగడమే అభిషేక్ శర్మ శైలి అని కొనియాడాడు. ఈ కారణంతోనే అతను వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా నిలిచాడని తెలిపాడు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మ అప్రోచ్ను ప్రశంసించాడు. పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకునేందుకే బౌలింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. 'పిచ్ ఎలా ఉందో చూడాలనుకున్నాం. అందుకే టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నా. రెండో ఇన్నింగ్స్లో కూడా వికెట్ అలానే ఉంది. మా కుర్రాళ్లు సమష్టి ప్రదర్శన కనబర్చారు. మైదానంలో మేం మంచి వైఖరితో పాటు శక్తితో ఆడాలనుకున్నాం. అదే మాకు లభించింది. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చాలా వేడిగా ఉంది. కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. హార్దిక్, శివమ్ దూబే, బుమ్రా సహకారం అందించారు.

అభిషేక్ శర్మ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్. అందుకు కారణం ఇదే. అతను తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు టోన్ సెట్ చేస్తాడు. మేం 200 పరుగులు చేయాల్సి ఉన్నా.. 50 పరుగులు లక్ష్యాన్ని చేధించాల్సి ఉన్నా అతని అప్రోచ్ మాత్రం మారదు. ఈ రోజు అతను అద్భుతంగా ఆడాడు. పాకిస్థాన్తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత వెరటన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 4.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 60 పరుగులు విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు.