న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. బుధవారం నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించి 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టీమిండియా 8 మంది బ్యాటర్లు, ముగ్గురు స్ట్రైక్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఈ కాంబినేషన్ బాగుందని, ఇదే కొనసాగిస్తామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో తమ జట్టు మెరుగవ్వాలని అభిప్రాయపడ్డాడు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు.
'మంచు ప్రభావం ఉన్నప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోవడం బాగుంది. ఇది మాకు పెద్ద సానుకూలాంశం. ఈ మ్యాచ్లో మేం బ్యాటింగ్ చేసిన తీరు బాగుంది. పవర్ ప్లేలో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత కూడా ఆటను 15వ ఓవర్ వరకు నిలకడగా తీసుకెళ్లాం. ఆ తర్వాత మా బ్యాటర్లందరూ తమ జోరును ఏ మాత్రం తగ్గించలేదు.

8 మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుంది. జట్టుగా మాకు ఈ వ్యూహం బాగా పనిచేస్తోంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దీనినే కొనసాగిద్దాం. నా బ్యాటింగ్ను ఆస్వాదించాను. ఈ రోజు తీవ్ర ఒత్తిడిలో ఆడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా సార్లు ఆడాను. నేను ముందుగా చెప్పినట్లుగా నెట్స్లో బాగా ఆడుతున్నాను. కొన్ని బంతులు ఆడిన తర్వాత నా సహజ శైలిలో ఆడుతున్నాను. గత 2-3 వారాలుగా నా షాట్లను నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేశాను. నెట్ సెషన్స్లో, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఇలానే ఆడాను. ఈ మ్యాచ్లోనూ అలానే ఆడటంతో సంతోషంగా ఉంది.
మా ఫీల్డింగ్ మెరుగుపడాలి. అయితే మంచు ప్రభావం ఉన్నప్పుడు ఫీల్డింగ్లో తప్పిదాలు జరుగుతాయి. ఈ విషయంలో నా ఆటగాళ్లకు నేను మద్దతుగా నిలుస్తున్నాను. అయితే ఈ ఒక్క విభాగంలో మేం మెరుగుపడాలి. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీసారి మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం.
అభిషేక్ శర్మ మ్యాచ్కు సిద్దమయ్యే విధానం అద్భుతం. అతను బ్యాటింగ్ చేసే తీరే కాదు.. హోటల్, బస్సులో ఉన్నప్పుడు తనను తాను సిద్దం చేసుకుంటాడు. ఈ చిన్న చిన్న విషయాలే మైదానంలో ప్రతిబింబిస్తాయి. అతను ఇప్పుడు తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.