జింబాబ్వేపై విజయం సాధించినా.. తమ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. బంతితో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. వెస్టిండీస్తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సెమీస్ చేరనుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని చెప్పాడు. సౌతాఫ్రికాతో ఓటమిని మరిచి ఈ మ్యాచ్కు సిద్దమైనట్లు వెల్లడించాడు. 'గత మ్యాచ్తో పాటు గ్రూప్ స్టేజ్ జ్ఞాపకాలను పక్కనపెట్టి ముందుకు సాగాలనుకున్నాం. మా వీడియో అనలిస్ట్ బ్యాటర్లు, బౌలర్ల కోసం ఒక ప్రత్యేక స్లైడ్ను సిద్ధం చేశారు. అందులో గతేడాది కాలంగా మేం ఎంత బాగా రాణించామో హైలైట్ చేసి చూపించారు. దాంతో మేం సానుకూలమైన మైండ్ సెట్తో ఈ మ్యాచ్ బరిలోకి దిగాం.

జింబాబ్వేతో పోరులో బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. కానీ గెలుపు గెలుపే కాబట్టి ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతాం. వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు మా లోపాలను సరిదిద్దుకోవాలి.

జింబాబ్వే బ్యాటర్ల ప్రతిభను నేను తక్కువ చేయాలనుకోవడం లేదు. వారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బాగున్న మాట వాస్తవమే.. కానీ వారు ఇన్నింగ్స్ను నిర్మించిన తీరు అమోఘం. పవర్ ప్లేలో టైమ్ తీసుకొని తెలివిగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ తీరు నన్ను ఆకట్టుకుంది.
బౌలింగ్ పరంగా మేం ఇంకాస్త చాకచక్యంగా వ్యవహరించాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కెప్టెన్గా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మేం కోల్కతా చేరుకున్నాక తదుపరి ప్రణాళికల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండటమే మా ముందున్న పని.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50 నాటౌట్), అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్), ఇషాన్ కిషన్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50 నాటౌట్) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికందర్ రజా తలో వికెట్ తీసారు.
అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికిందర్ రాజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/22) మూడే వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.
