చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన భారత ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సీఎస్కే మేనేజ్మెంట్ విఫలమైందని చెప్పాడు. ధోనీ ఒక్కడితోనే విజయాలు దక్కవని, ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తేనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. సరైన భారత ఆటగాళ్లు లేకపోవడంతో ఘోర పరాజయాలు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సీఎస్కే 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సురేశ్ రైనా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోనీ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు? ఎవరని ప్రశ్నించాడు. ధోనీ ఎప్పుడూ వేలంలో పాల్గొనేవాడు కాదని గుర్తు చేశాడు.

సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదు..
'కాశీ సర్కు అడ్మినిస్ట్రేషన్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రూపా మేడమ్కు ఆటగాళ్లను కొనుగోలు చేయడం, క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడంపై పట్టు ఉంది. అయితే ఈ సారి జట్టు ఎంపిక సరిగ్గా లేదు. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎందుకు జరిగిందని అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే ధోనీ వేలంలో పాల్గొనడు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై తన అభిప్రాయం మాత్రమే చెబుతాడు. కొందరు ఆటగాళ్ల పేర్లు మాత్రమే సూచిస్తాడు.
43 ఏళ్ల వయసులో ధోనీ అన్క్యాప్డ్గా బరిలోకి దిగి కష్టపడుతుంటే.. మిగతా ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. రూ. 18 కోట్లు, రూ. 17 కోట్లు, రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కూడా విఫలమవుతున్నారు. మేనేజ్మెంట్ నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
ధోనీ తర్వాత వికెట్ కీపర్ ఎవరు?
ఒకప్పుడు సీఎస్కే ఎంపికైన ఆటగాళ్లు ఆ సీజన్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జట్టులో అలాంటి క్వాలిటీ మిస్సైంది. సమష్టి ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరేవారు. ధోనీ తర్వాత వికెట్ కీపర్ ఎవరు? వేలంలో సీఎస్కే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో కూడా సీఎస్కే మేనేజ్మెంట్కు తెలియదు.
సీఎస్కే ఆటగాళ్లు అత్యధిక డాట్ బాల్స్ ఆడారు. ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన జట్టుగా సీఎస్కే నిలిచింది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. డెవాన్ కాన్వే ఒక్కడే ఫామ్లో ఉన్నాడు. అతను కూడా అనివార్య కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.